శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో, జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. బ్లాక్ బస్టర్ మహర్షి తరువాత మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ ఇప్పటీకే విడుదల చేసిన పోస్టర్లు, బర్త్ డే టీజర్ అభిమానులని, సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే నవంబర్ 22, శుక్రవారం సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ సూపర్ స్టార్ అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ టీజర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. మహేష్ బాబు ఈ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల మహేష్ నటించిన చిత్రాలకు కొంచెం భిన్నంగా పూర్తీ స్థాయి మాస్ ఎలిమెంట్స్, కామెడీతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తుంది.
మహేష్ బాబు కెరీర్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ 26వ చిత్రం. పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 వంటి చిత్రాలతో విజయాలు అందుకున్న అనీల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని సంవత్సరాల విరామం తరువాత అలనాటి ప్రముఖ కథానాయిక విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, అజయ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర నిర్మాతలగా వ్యవహరిస్తూ గొప్ప నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుగా జనవరి 11, 2020 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
[subscribe]