తెలంగాణలోని పార్టీపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన నివాసంలో ఈరోజు సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మేధోమథనంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే తెలంగాణలో రాజకీయ వేడి రగుల్చుతున్న వరి సేకరణ అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. గత వారం రోజుల్లో తెలంగాణ పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా మొత్తం 38 మంది నేతలకు ఆహ్వానం అందింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, మాజీ మంత్రులు హాజరుకావాలని ఏఐసీసీ ఆహ్వానాలు పంపించింది. 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ పార్టీలకు పిలుపునిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమావేశం కావడం విశేషం.
ఈ సందర్భంగా పార్టీలో అంతర్గత కలహాలను పక్కకు పెట్టి నేతలందరూ ఒకేతాటిపై నిలవాలని అగ్రనాయకత్వం సూచించింది. గత 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రభుత్వ పునరాగమనాన్ని ఆపలేకపోయింది. ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలకు సమాయత్తం కావాలని అగ్రనాయకత్వం హెచ్చరిస్తోంది. గత నెలలో ఒక సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టిపారేశారు. కేసీఆర్ ను నమ్మనమ్మలేమని వ్యాఖ్యానించారు. కెసిఆర్తో, ఆయన పార్టీ టిఆర్ఎస్తో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులలో పొత్తు పెట్టుకోదు. 2004, 2009, 2014, 2019లో ఆయన్ను చూశాం. మరే ఇతర నాయకుడిని లేదా పార్టీని నమ్మవచ్చు కానీ కేసీఆర్, టిఆర్ఎస్లను కాదు అని రేవంత్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ