తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ముందుగా వాసాలమర్రిలోని దళితవాడలో పర్యటించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వెంటనే అమలు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం అవసరమైన రూ.7.60 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నానని, రేపటి నుంచే దళితుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నగదు జమ చేస్తాం అని సీఎం తెలిపారు. గ్రామంలోని అందరికీ ఒకే విడతగా దళిత బంధు నిధులు పంపిణీ జరుగుతుందని, ఎలా ఖర్చు చేసుకుంటారో వారి ఇష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధు సొమ్మును వృధా కానివ్వొద్దని, పద్ధతిగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అలాగే ఆలేరు నియోజకవర్గంలో రూ.30 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దళితులకు ఎవరికి ఆపద వచ్చినా, దళిత రక్షణ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దళిత బంధు నిధులు అందజేతతో పాటుగా గ్రామంలోని దళితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఎర్రవల్లి గ్రామంలో ఇళ్లన్నీ పడగొట్టి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చామని, అందుకోసం గ్రామస్థులను 6 నెలలు గుడారాల్లో ఉంచి ఇళ్లు నిర్మించామన్నారు. అదే తరహాలో వాసాలమర్రిలో కూడా కొత్త ఇళ్లు నిర్మాణం చేపడతామని తెలిపారు. అలాగే గ్రామంలో 100 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూమి ఉందని, ఆ భూమిని దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ