నాగార్జునసాగర్లోని విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరంలో నిర్వహించిన ‘మహా వరుణ యాగం’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఈ యాగంలో సీఎం రేవంత్ సహా ఆయన ధర్మపత్ని గీత పూర్ణహుతి క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాగ క్రతువుల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి, ఆయన సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహా వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
కాగా, సోమవారం ఉదయం తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి దంపతులు మహా వరుణ యాగాన్ని ప్రారంభించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మహా వరుణ యాగంలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, యాగ క్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, దేవస్థానానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.






































