కాంగ్రెస్ నేత కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తాను ఎలాంటి చర్చ చేయలేదని స్పష్టం చేశారు. సుస్మితకు తన అభిప్రాయాలను స్వతంత్రంగా వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆమె వ్యాఖ్యలను ప్రశ్నించే అధికారం తమకు లేదని పేర్కొన్నారు.
సుస్మిత తనకు నచ్చిన విధంగా వ్యవహరిస్తారని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని కొండా మురళి అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేశారు. “మా బిడ్డ చేసిన వ్యాఖ్యలతో మాకేం సంబంధం?” అని వ్యాఖ్యానించారు. పార్టీ కమిటీకి చెప్పాల్సిన విషయాలన్నింటినీ ఇప్పటికే వివరించామని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
పరకాలలో సుస్మిత వ్యాఖ్యలపై వివాదం
ఇటీవల వరంగల్ జిల్లా పరకాలలో కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు.
అదే సమయంలో రేవూరి ప్రకాశ్రెడ్డికి పరకాల అసెంబ్లీ టికెట్ ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని సుస్మిత ప్రకటించడం కూడా పార్టీలో కలకలం రేపింది.
క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం
సుస్మిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమెపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అలాగే సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖను వివరణ కోరాలని పీసీసీ నిర్ణయించినట్లు సమాచారం.
అయితే సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా కొండా మురళి కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్లో కొనసాగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.





































