తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం నాడు ధరణి పోర్టల్ పై రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నారని, సీఎం అంచనాల మేరకు ధరణి పోర్టల్ ద్వారా సులభంగా, పారదర్శకంగా ఎటువంటి విచక్షణ అధికారాలు లేకుండా వేగంగా ప్రజలకు సేవలందించాలని రెవెన్యూ సిబ్బందిని కోరారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ వెంటనే జరుగుతోందని అన్నారు.
ధరణి దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది:
ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ పనితీరును రెవెన్యూ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ వివరించారు. స్లాట్ బుకింగ్, సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్ , పార్టిషన్ మాడ్యూల్స్ పై వివరించారు. తహసీల్దార్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు, బాధ్యతలను వివరించారు. రిజిస్ట్రేషన్ సేవలతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని, వారు రెవెన్యూ విధులతో పాటు జాయింట్ సబ్ రిజిష్ట్రార్ గా బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు. రెవెన్యూ అధికారులు ఒక టీం వర్క్ లాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ధరణి టెక్నికల్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూంతో పాటు జిల్లా స్థాయి టెక్నికల్ సపోర్ట్ టీంలు పని చేస్తాయన్నారు. ధరణి అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా , మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ వి.వేంకటేశ్వర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu