తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ముట్టడికి యత్నించడంతో హైటెన్షన్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో ఫాంహౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఫాంహౌస్ వద్ద భారీ బందోబస్తు
ఎర్రవెల్లి ఫాంహౌస్ వద్ద వెయ్యి డప్పులతో ‘చావు డప్పు’ కొడతామంటూ కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
ఫాంహౌస్ వైపు వస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఫాంహౌస్కు బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల ముట్టడి యత్నం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎర్రవెల్లి ఫాంహౌస్కు బయలుదేరారు. అసెంబ్లీ నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫాంహౌస్ వైపు పయనమయ్యారు.
కేసీఆర్ చావును కోరుకుంటున్నామంటూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తమ పార్టీ అధినేత ఫాంహౌస్కు వెళ్లాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
ఫాంహౌస్కు వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలను బొల్లారం చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘‘మా ఇంటికి మేము వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అంటూ పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఫాంహౌస్ ముట్టడికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయత్నించడం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఎర్రవెల్లిలో ఏం జరుగుతుందో?
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒకేసారి ఎర్రవెల్లి ఫాంహౌస్ వైపు కదులుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా మారుతుందనే ఉత్కంఠ నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.
కేసీఆర్పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, వాటికి బీఆర్ఎస్ నేతల ప్రతిస్పందనతో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఫాంహౌస్ ముట్టడి ప్రయత్నంతో ఈ రాజకీయ వివాదం మరింత ముదిరింది.










































