తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రెండు రోజుల రాష్ట్ర స్థాయి ‘చింతన్ శిబిర్’ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అధ్యతన ఈ కార్యక్రమం జరగనుంది. నేడు, రేపు రెండు రోజుల పాటు జరుగనున్న ఈ మేధో మథన సదస్సుకు మేడ్చల్ లోని కీసర వేదిక కానుంది. జాతీయ కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన రాజస్థాన్ లోని ఉదయ్పూర్ ‘చింతన్ శిబిర్’కు కొనసాగింపుగా దీనిని చేపడుతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కాగా ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో ఉదయ్పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపనుంది.
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా అధికారంలోకి రావడమే టార్గెట్గా భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తద్వారా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 33 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ‘చింతన్ శిబిర్’ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే వివిధ అంశాలపై చర్చించేందుకు పార్టీ నేతలతో ఆరు గ్రూపులను ఏర్పాటు చేశామని, ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ద్వారా రాబోయే 90 నుండి 180 రోజుల్లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పంచాయితీ, మండల, జిల్లాస్థాయి స్థానాలను భర్తీ చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని భట్టి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, తెలంగాణలో సామాజిక న్యాయం జరగడంపై చర్చ జరుగుతుందని భట్టి చెప్పారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆకాంక్షించిన అన్ని కలల సాధనకు పార్టీ కృషి చేస్తుందన్నారు భట్టి విక్రమార్క. ఇక సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ లోని 108 మంది కీలక నేతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడంతో అధ్యక్షుడు లేకుండానే సమావేశాలు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF