‘అగ్నిపథ్’ మంటలు తెలంగాణకు కూడా పాకాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున గుమికూడిన ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. దీనికి ముందు రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఒక్కసారిగా ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ఇదే క్రమంలో స్టేషన్లలో నిలిచి ఉన్న పలు రైళ్లకు నిప్పంటించారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను రైల్వేశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు పోలీసులు నిరసనకారులను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్మీ అభ్యర్థులు భారీగా రావడంతో పాటు ఒక్కసారిగా రైళ్లపై దాడి చేయడంతో రైల్వే పోలీసులు కూడా వారిని నిలువరించలేకపోయారు. అక్కడున్న వారికీ ఏం జరగుతుందో అర్ధమయ్యేలోపే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. రైల్వేస్టేషన్లోని 10 ప్లాట్ ఫార్మ్స్ లో మూడు ప్లాట్ఫామ్లలో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిరసనకు దిగడంతో పాటు రైలు పట్టాలకు నిప్పుపెట్టారు. ఈ హఠాత్పరిణామంతో రైళ్లలో ఉన్న ప్రయాణీకులు భయాందోళనలకు లోనయ్యారు. తాము కూర్చున్న బోగీలకు నిప్పంటుకోవడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
అగ్నిపథ్ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గడచిన రెండు, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ నిరసన సెగలు తెలంగాణకు పాకడం గమనార్హం. అయితే సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను హెచ్చరిస్తున్నారు. వెంటనే స్టేషన్ను ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నారు. లేనిపక్షంలో కాల్పులు జరుపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పుల ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ