టీడీపీ నేతలు జేసీ సోదరులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీ జేసీ రెడ్డి మరియు ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాలు మరియు కార్యాలయాలపై ఈడీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వారి అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్ల చేశారన్న సమాచారంపై ఈడీ అధికారులు ఆరా తీశారు. స్క్రాప్ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్తో జేసీ ట్రావెల్స్ నాగాలాండ్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఈడీ దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలోనే ఈ దాడులు చోటుచేసుకున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి.
సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో మొత్తం 20 మంది అధికారుల వరకూ పాల్గొంటున్నట్లు సమాచారం. తాడిపత్రిలో పట్టున్న నాయకులు కావడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు చోటివ్వకుండా ముందు జాగ్రత్తగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ లోని జేసీ బ్రదర్స్ ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి మొత్తం ఆస్తులు, వ్యాపార లావాదేవీలు వంటి వాటిపై పూర్తి వివరాలను రాబడుతున్నారు. కాగా దీనిపై ఇటు జేసీ బ్రదర్స్ కానీ, అటు టీడీపీ వర్గాలు కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ