శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అసువులు బాసిన అమరులది ముమ్మాటికి వీరోచిత పోరాటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జాతి సంపద కోసం పోరాడి ప్రాణాలు వదిలిన వారిని రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా గౌరవిస్తుందని ఆయన తెలిపారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన సంఘటనపై శాసనమండలిలో బీజేపీ, ఇతర సభ్యులు లేవనెత్తిన సందేహలను మంత్రి జగదీష్ రెడ్డి నివృత్తి చేశారు. సంఘటన సమాచారం ఆ రాత్రి 11.35 నిమిషాలకు అందగానే ట్రాన్స్కో మరియు జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు, స్థానిక శాసనసభ్యులు గువ్వల బాలరాజుతో పాటుగా సంఘటనా స్థలికి అదే రాత్రి 2.50 కు చేరుకున్నామన్నారు. ఈ సంఘటనపై సీఐడి విచారణ పురోగతిలో ఉందని, అదే సమయంలో ఐదుగురు సభ్యులతో వేసిన అంతర్గత విచారణ కరోనా వలన జాప్యం జరుగుతోందన్నారు. ఆ ఐదుగురి సభ్యులలో ముగ్గురు కరోనా చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.
వాస్తవానికి 15 రోజుల్లోనే అంతర్గత విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఆదేశించినా కరోనాతో జాప్యం జరుగుతోందన్నారు. మృతుల కుటుంబాలకు సముచిత గౌరవం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. సంఘటన జరిగిన సాయంత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ డిఈ కుటుంబానికి 50 లక్షలు, ఏఈ కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ప్రకటించడమే కాకుండా మానవీయ కోణంలో ఇదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర్ రాజాకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. దానికి తోడు శాఖాపరంగా డిఈ కుటుంబానికి కోటి రూపాయలు, ఒక్కో ఏఈ కుటుంబానికి 75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆయా కుటుంబాలకు రొటేషన్ కు బిన్నంగా ఉద్యోగాలు అందించేందుకు జెన్కో నిర్ణయించందన్నారు.
ఇప్పటివరకు జాతీయంగా అంతర్జాతీయ స్థాయిలో రియాక్టర్లు పేలడం, మంటలు సంభవించడం జరిగిందని అందుకు భిన్నంగా ఇక్కడ పొగతో ప్రాణాలు పోయాయన్నారు. ఆ రాత్రి అక్కడికి చేరుకున్న తాము సియండి ప్రభాకర్ రావు తో కలసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా పొగ అవరించడంతో మరింత లోపలికి వెళ్లలేక పోయామన్నారు. ఆక్సిజన్ సహాయంతో రెండో మారు క్షతగాత్రులను కాపాడేందుకు లోపలికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu