ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు సంబంధించిన సిబ్బంది నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో 60 రకాల పరీక్షల నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ సెంటర్ ను, మొబైల్ క్రిటికల్ కేర్ అంబులెన్స్ తో పాటు ఆక్సిజన్ ప్లాంట్ లను మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కేన్సర్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలను సిద్ధం చేశారని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కేన్సర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందని, అందుకు అనుగుణంగానే 60 రకాల పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలలో నిర్వహించేందుకు అన్ని ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. అంతే గాకుండా అందుకు సంబంధించిన సిబ్బందిని, వైద్యుల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనాను నిలువరించే ప్రయత్నంలో తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి ఆమోఘమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కే.వి.రామారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డియంహెచ్ఓ కొండల్ రావు, ఆసుపత్రి సూపరిండెంటెంట్ జైసింగ్ రాథోడ్, డిసిహెచ్ డాక్టర్ మాతృ, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ