గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ మరియు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి కేటిఆర్ ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, వచ్చే మూడు, నాలుగు రోజుల్లో నగరంలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. వర్షాల సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా నగరంలో లోతట్టు ప్రాంతాల నివసించే ప్రజలతో పాటుగా, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు.
వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలోని ప్రజలకు రిలీఫ్ క్యాంపుల కోసం కమ్యూనిటీ, ఫంక్షన్ హాల్స్ను సిద్ధం చేయాలని అన్నారు. నిరాశ్రయుల కోసం అన్నపూర్ణ భోజనం అందించాలని చెప్పారు. రిలీఫ్ క్యాంపులలో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని, అదేవిధంగా అవసరమైన చోట మొబైల్ టాయిలెట్లును అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు వెంటనే 100 మంది సీనియర్ అధికారులను ప్రత్యేక ఆఫీసర్లుగా నియమించాలని మున్సిపల్ శాఖను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. ఈ 100 మంది ప్రత్యేక ఆఫీసర్లు వచ్చే 10 రోజుల పాటుగా క్షేత్రస్థాయిలో ఇతర అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu