తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి టి.హరీశ్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) 29వ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని, ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని, బ్యాంకులకు ఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని మంత్రి కోరారు. తద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించాయని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరింత ముద్రా రుణాలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని బ్యాంకర్లకు తెలిపారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్.బి.ఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సిజిఎం వై.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ