తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, విజ్ఞాన్ స్కూల్కు చెందిన బస్సును వెనుక నుంచి ఢీ కొట్టగా అందులోని సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడిన ఆయన గాయపడిన విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వారిని హైదరాబాద్కు తీసుకురావాలని కూడా మంత్రి కేటీఆర్ కలెక్టర్కు సూచించారు.
కాగా ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో దాదాపు 30 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వెనుకనుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో గాయపడిన విద్యార్థులు హాహాకారాలు చేశారు. అందరూ చిన్న పిల్లలు కావడం, పైగా గాయాలతో రక్తం కారుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు పెద్దగా రోదించారు. దీంతో స్థానికులు పరుగున వచ్చి సాయమందించారు. ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పరుగున సంఘటన స్థలానికి వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులను ఎల్లారెడ్డిపేటలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని మరో 10 మందికి కూడా గాయాలవగా.. వారిని సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE