కొత్త గవర్నమెంట్ రాగానే పాత ప్రభుత్వంలో ఉన్న నేతలను , అధికారులను టార్గెట్ చేయడం సర్వసాధారణ విషయం. ఇప్పుడు తాజాగా అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గులాబీ నేతలను అలాగే ఇరుకున పెట్టే పనిలో పడుతోంది. మొన్నటికి మొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజు వ్యవహారంపై కేసు, నిన్న మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్లపై కేసులు నమోదు కాగా, రేపు ఏ బీఆర్ఎస్ నేత పేరు బయటకొస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది.
బీఆర్ఎస్ నాయకుల్లో చాలా మందిపై గతంలో భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు వెళ్లిన ఘటనలు కూడా ఉన్నా వాటిపై ఎప్పుడూ కేసులు నమోదు కాలేదు. దర్యాప్తు అసలే మొదలవ్వలేదు. కానీ ఇప్పుడు అలాంటి కేసుల బూజులు దులిపే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి . నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గతంలో లీజుకు తీసుకున్న భూముల వ్యవహారంతో మొదలైన ఈ వ్యవహారం.. ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి వరకూ వచ్చింది. రాబోయే రోజుల్లో మరికొందరిపైనా ఎంక్వయిరీ మొదలు కానుందనే వార్త ఇప్పుడు గులబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.
గత కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములన్నిటినీ గతంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. అప్పట్లో కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు కూడా చాలా గ్రామాల్లో దళితులకు ఇచ్చిన భూములను అక్రమంగా లాక్కున్నారన్న విమర్శలు వినిపించాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడంతో గతంలో పోలీసు స్టేషన్లలో పేరుకుపోయిన పాత ఫిర్యాదులన్నీ ఒక్కొక్కటిగా మళ్లీ పొలిటికల్ సీన్లోకి వస్తున్నాయి. గతంలో ఏ గులాబీ నేతపై భూకబ్జా, ఆక్రమణలు చేశారని కంప్లైంట్స్ వచ్చాయో అన్నదానిపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. వరుసగా నమోదవుతున్న కేసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తర్వాత రానున్న పేరు ఎవరదే చర్చ జరుగుతోంది.
ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చేసిన నేరం ఏంటి..ప్రస్తుతం ఉన్న కేసులు ఏంటనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఆర్టీసీ నుంచి లీజుకు తీసుకున్న భూములకు జీవన్ రెడ్డి వార్షిక ఫీజు చెల్లించకపోవడంతో పాటు విద్యుత్ వినియోగానికి డిస్కంలకు బకాయిపడడంతో తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణాల విషయంలోనూ జీవన్ రెడ్డికి చిక్కులు మొదలయ్యాయి.
అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డిపైన కూడా గట్టిగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం ఎస్టీ కాలనీలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి అన్యాక్రాంతం చేసుకున్నారంటూ.. శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది నవంబర్ 18న ఫిర్యాదు అందింది. దీంతో మల్లారెడ్డిపై డిసెంబర్ 6న పోలీసులు చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ కేసును కూడా పోలీసులు నమోదు చేశారు
మరోవైపు అనురాగ్ యూనివర్శిటీ కోసం ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా భూములు లాక్కున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. 2019లో సోషల్ మీడియా వేదికగా ఈ మ్యాటర్ చాలా రోజుల పాటు హాట్ టాపిక్గా మారింది. అయితే పల్లా కూడా డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రివర్స్లో ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ దీనిని కూడా తిరగదోడుతుందా అన్న అనుమనాలు వినిపిస్తున్నాయి.
అలాగే మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. పెబ్బేరులోని ఆలయ భూముల్ని కబ్జా చేసి తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇక మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ పేరుతో ఆయన అనుచరులు, బంధువులు.. మహబూబ్నగర్లో భూముల కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. అలాగే భూపాలపల్లి, డోర్నకల్, మహబూబాబాద్, జనగామ వంటి నియోజకవర్గాల్లోనూ గులాబీ నేతలపై వచ్చిన భూకబ్జాల ఆరోపణలన్నింటిపైనా ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల సంగతిని రేవంత్ రెడ్డి సర్కార్ తేల్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ