తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం ప్రారంభం అవుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ, అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిందని ఆయన అన్నారు. ఈ అంశంపై మంత్రి కేటిఆర్ బుధవారం నాడు వరుస ట్వీట్స్ చేశారు.
“అన్ని కోణాల్లో ఆలోచించి, రాష్ట్రంలోని అన్ని వర్గాలను, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రెవెన్యూ చట్టానికి రూపకల్పనచేసింది. సామాన్యుడి మెడకు పాశంగా మారుతున్న ఒక్కో చిక్కుముడిని విప్పుతున్నది. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూలో భారీ సంస్కరణలు సంకల్పించారు. సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఆవిష్కరించే సమగ్ర బిల్లును అసెంబ్లీలో నేడు ప్రవేశపెట్టడం జరిగింది. భూ సంస్కరణలు తెచ్చిన పీవీ శతజయంతి సంవత్సరమిది. తెలంగాణ నేల కోసం, జాతి జనుల కోసం నిరంతరం పరితపించిన భూమి పుత్రుడు ప్రజా కవి కాళోజీ జయంతి నేడు. అలాంటి శుభతరుణాన రైతుకు దన్నుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం విశేషం” అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.
“కొత్త రాష్ట్రం పొద్దుపొడిచింది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆరేళ్లుగా సరికొత్త పాలనా సంస్కరణలతో పరిపాలనను ప్రజలను మరింత దగ్గర జేసింది. దశాబ్దాల బూజుపట్టిన చట్టాలను తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ అవినీతిరహిత వ్యవస్థ కోసం నడుంకట్టి జనరంజక పాలనతో ముందుకు సాగుతున్నవేళ..మొన్న పంచాయితీ రాజ్ చట్టం, నిన్న మునిసిపల్ చట్టం, నేడు రెవెన్యూ చట్టం…ఐదేండ్ల కోసం వచ్చే రాజకీయాలను పక్కన నెట్టి భవిష్యత్ తరాల అవసరాల కోసం అలుపెరుగని అభివృద్ధి ప్రస్తానం. జయహో తెలంగాణ.. జయ జయహో కేసీఆర్” అని మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu