తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నవంబర్ 7, గురువారం నాడు గచ్చిబౌలిలోని ఐఎస్బి లో సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో గిరిజన ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వందమంది గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న గిరిజన యువతీ యువకులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.
సాధారణంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించేవి చిన్న, మధ్య తరహా పరిశ్రమలే అని చెప్పారు. అభివృద్ధికి పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న పరిశ్రమలు కూడా కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీల కోసం వ్యాపారాలు చేయొద్దని కేటీఆర్ సూచించారు. వ్యాపారంలో రాణించడం అనేది ఏ ఒక్కరికో మాత్రమే సాధ్యమయేది కాదని, కష్టపడి పనిచేస్తే ఎవరైనా విజయం సాధిస్తారని చెప్పారు. ప్రతి పారిశ్రామిక పార్కుల్లోనూ రిజర్వేషన్స్ కల్పించామని, మహిళా ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు.
[subscribe]