తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనలో నిందితుడైన సురేశ్ మృతి చెందాడు. విజయారెడ్డిపై దాడి చేస్తున్న క్రమంలోనే మంటలంటుకుని తీవ్ర గాయాలైన సురేష్ మూడురోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 7, గురువారం నాడు మృతి చెందాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు సురేష్ మృతి చెందినట్టుగా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. తహసీల్దార్ విజయారెడ్డిని నవంబర్ 4, సోమవారం నాడు తన కార్యాలయంలోనే సురేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డిని రక్షించే ప్రయత్నం చేసిన ఆమె కారు డ్రైవర్ గురునాథం కూడ మంగళవారం నాడు ప్రాణాలు కోల్పోయాడు.
ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నిందితుడు సురేష్ దగ్గర పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. తనకు సంబంధించిన వివాదాస్పదమైన భూమికి పట్టా ఇవ్వలేదనే కోపంతోనే తహసీల్దార్ ను సజీవ దహనం చేసినట్లు తెలిపాడు. పోలీసులు సురేష్ పై రెండు కేసులు నమోదు చేసారు. అతని వాంగ్మూలం అనంతరం విజయారెడ్డి సజీవ దహనం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సురేశ్ కాల్డేటా, విజయారెడ్డి కాల్ డాటాను పరిశీలిస్తున్నారు, అదేవిధంగా విజయారెడ్డిని సజీవ దహనం చేసిన తర్వాత బయటకు పరుగెత్తిన సురేష్, కారులో ఎవరితోనే మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు, వారి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయని భావించడంతో మరి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.