ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకుని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 39, 40, 44వ డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ బుధవారం నాడు పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరూన్ పాస్ బుక్ పై ప్రజల్లో అపోహలు, అనుమానాలు తొలగించి చైతన్యం, అవగాహన కల్పించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి కి మంత్రి సూచించారు. స్థానిక నివాసాల ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయదారులకు పట్టాదారు పాసు పుస్తకాల తరహాలో ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించినందున ఆయా వివరాలతో కూడిన రికార్డును పకడ్బందీగా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నగరాల్లో, గ్రామాల్లోని ప్రతి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాలని మంత్రి సూచించారు. కొత్త రెవిన్యూ చట్టంలో భాగంగా, వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ, పట్టాదారు పాసు పుస్తకాల ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. భూములకు భద్రత కల్పించడంతోపాటు, ఆయా భూ, ఇళ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఖమ్మం నగరంలో ఇంటి నెంబర్, విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇల్లు, ఇతర నిర్మాణాల వివరాలు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఇళ్లు, వగైరాలన్నీ ప్రతి అంగుళం రికార్డు చేయాలని అందుకు తగ్గట్లుగా, కింది స్థాయి వరకు ఆదేశాలు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు సూచించారు.
ఎలాంటి లోపాలు లేకుండా రికార్డు ప్రక్రియను ఓ ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల్లో అనుమానాలు, అపోహలుంటే తొలగించాలని చెప్పారు. కేవలం భద్రత కల్పించడమే తప్ప, ఇందులో హిడెన్ ఎజెండా ఏదీ లేదనే విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వివరించాలన్నారు. దళారులు, ఇతరులెవరికీ డబ్బులు కూడా ఇవ్వాల్సిన పనిలేదని, ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జరుగుతుందన్న విషయంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచాలని సూచించారు. అందుకు ప్రజలు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu