హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లాల గిరిజన అభివృద్ధి అధికారులతో తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు లబ్దిదారులకు చేరడంలో మరింత సమర్ధవంతంగా పనిచేయడం, గిరిజన విద్యాలయాలు పునః ప్రారంభంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల ఇంటి వద్దకే ఉపాధ్యాయులు వెళ్లి పాఠాలు చెప్పడం, ఐటీడీఏలలో గిరిజన సమస్యల్ని సత్వర పరిష్కారం చేయడంపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు.
“కోవిడ్ సమయంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా ఇవి గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగపడేలా పని చేస్తున్నాం. గిరిజన గ్రామాల్లో 3 ఫేజ్ కరెంట్ కోసం 117 కోట్ల రూపాయలు కేటాయించాము. వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలకు పాడి పశువులను ఇవ్వడం ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. వీటిని సరైన విధంగా అమలు చేయడం, అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడంపై చర్చించాం. ఎకానామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద ఇప్పటికే దాదాపు 500 మంది గిరిజన యువతకు ఓనర్ కమ్ డ్రైవర్ పథకంలో కార్లు ఇచ్చాము” అని మంత్రి అన్నారు.
“గిరిజన సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న పథకాలు నిజమైన లబ్ది దారులకు అందేందుకు అధికారులు వారధులుగా పని చేయాలని చెప్పాము. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ చాలా పకడ్బందీగా పని చేస్తుందనే విశ్వాసాన్ని పెంచేందుకు ఈ సమావేశం నిర్వహించుకున్నాము. కోవిడ్ నేపథ్యంలో ఏజెన్సీలో సరైన వసతులు లేని గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లి విద్యా బోధన చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము. ఇలా ప్రతి కార్యక్రమంలో లబ్దిదారులకు మేలుజరగడమే లక్ష్యంగా పని చేయడమే మా ఉద్దేశ్యం” అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu