రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో గత 46 రోజులుగా సుమారు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను, ఉద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడ కేసీఆర్లా ప్రవర్తించడం లేదని, అధికారం, అహంకారంతో నియంతలా మారిపోయారని అన్నారు. స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరిచే తెలంగాణ సమాజం ఇప్పుడు సీఎం కేసీఆర్ చేతిలో నలిగిపోతోందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించాలని భట్టి విక్రమార్క కోరారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకపోతే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ కార్మికులను చర్చలకు పిలవకపోతే రాజ్యాంగ సంక్షోభంపై గవర్నర్కు, రాష్ట్రపతికి వివరిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఆ వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీఎంయూనే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందా అని ఆయన ప్రశ్నించారు. జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారికీ వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
[subscribe]