గొర్రెల పంపిణీ, గొర్రెల సంపద అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, 2వ విడత గొర్రెల పంపిణీ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి పాల్గొన్నారు.
2వ విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలు విడుదల:
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అందిస్తున్న సహకారం, తోడ్పాటు, వివిధ కార్యక్రమాల అమలుతో పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వివరించారు. కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది సీఎంకేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీతో అద్బుతమైన ఫలితాలు లభించాయని అన్నారు. 2వ విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని, ఈ నెల 28 వ తేదీన హుజూరాబాద్ లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. పెరిగిన అన్ని ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను పెంచాలని సీఎంని కోరిన మీదట 1.25 లక్షల రూపాయల నుండి 1.75 లక్షల రూపాయల కు పెంచారని చెప్పారు. సమర్ధవంతంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా పశువైద్యాదికారులను కోరారు.
రాష్ట్రంలో గొర్రెల సంఖ్య కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.91 కోట్లు ఉంది:
ధనవంతులైన గొల్ల, కురుమలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ ఉండాలనే గట్టి సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు ప్రాంతంలోనే ఇన్సురెన్స్ చేసి పత్రాలను అందజేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గొర్రెలు చనిపోతే సకాలంలో తగు చర్యలు తీసుకోకపోవడం వలన ఇన్సురెన్స్ క్లెయిమ్ కాక రైతులు నష్టపోతున్నారని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చనిపోయిన గొర్రెకు 10 రోజులలోగా క్లెయిమ్ చేసి బాధితుడికి గొర్రెను అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి విడతలో 79.16 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా, వాటికి కోటి 30 లక్షల పిల్లలు పుట్టినట్లు తెలిపారు. వీటి విలువ 7800 కోట్ల రూపాయలుగా ఉంటుందని వివరించారు. అంతేకాకుండా 93వేల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.91 కోట్లు ఉన్నదని అన్నారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ పనితీరును కేంద్ర ప్రభుత్వం అనేక సందర్బాలలో ప్రశంసించిందని, సీఎం కేసీఆర్ అందించిన తోడ్పాటు, శాఖలోని వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులు అందరి సమిష్టి కృషితో ఇది మన శాఖ సాధించిన విజయంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు.
ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలలో గొర్రెల మార్కెట్ ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభం:
పెరిగిన జీవాలకు అనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని చెప్పారు. శాఖకు సంబంధించిన అన్ని ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రైతులకు సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన సంచార పశువైద్య శాలల పనితీరు పట్ల నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గొర్రెల పెంపకందారులు గొర్రెలను అమ్ముకునేందుకు, కొనుగోలు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు, వసతులతో కూడిన మార్కెట్ ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి తదితర జిల్లాలలో గొర్రెల మార్కెట్ ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో గొర్రెల మార్కెట్ నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని ఆయా జిల్లా కలెక్టర్ ల సహకారంతో గుర్తించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని ఉన్న అన్ని పశు వైద్య శాలలను దశల వారిగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, మొదటి విడతలో సుమారు 480 కి పైగా ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు, వసతులను కల్పించడం జరిగిందని వివరించారు.
గజ్వేల్ లో నట్టల నివారణ మందు పంపిణీ ప్రారంభం:
జీవాలకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసి జిల్లాల లోని పశువైద్య శాలలకు సరఫరా చేస్తున్న మందులు మాత్రమే కాకుండా రైతుల నుండి డిమాండ్ ఉన్న మందులు ఏమైనా ఉంటే సమగ్ర సమాచారం సేకరించి వాటి కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జీవాలకు వైద్య సేవలు, గొర్రెల పంపిణీ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని మంత్రి చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద గొర్రెలు, పశువుల షెడ్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆగస్టు 6 నుండి 13 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్ లో లాంచనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ