తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ శుక్రవారం నాడు ప్రజాదీవెన పాదయాత్రలో స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అపోలో ఆసుపత్రికి వెళ్లి ఈటల రాజేందర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అస్వస్థతకు గురవడంతో హుజూరాబాద్ నియోజవర్గంలో చేపడుతున్న పాదయాత్రను ఈటల రాజేందర్ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. “పన్నెండు రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి. కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుండే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తాను” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ