వచ్చే ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం బేగంపేటలోని నాలాను మంత్రి శ్రీనివాస్ యాదవ్ జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎస్ఎన్డీపీ, ఇతర శాఖల అధికారులతో కలిసి సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలాలో పూడికను పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పారు. నాలా వెంట ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను అన్ని వెంటనే తొలగించాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, నాలాలు ఆక్రమణలకు గురి కావడం, నిర్వహణ పట్టించుకోకపోవడం వలన ప్రతి ఏటా వర్షాకాలంలో నాలా పరిసర కాలనీలు, ఇండ్లు ముంపుకు గురవుతూ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గతంలో ఎవరూ వీరి సమస్యను పట్టించుకోలేదని అన్నారు. ఎన్నో సంవత్సరాల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నగరంలోని నాలాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వందల కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) చేపట్టినట్లు చెప్పారు. ఎస్ఎన్డీపీ క్రింద నగరంలో అనేక నాలాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే 45 కోట్ల రూపాయల వ్యయంతో బేగంపేట నాలా అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ నిధులతో నాలాకు ఇరువైపులా అవసరమైన చోట్ల రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, పూడిక తొలగింపు వంటి అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాలా అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం నాలా పరిసర కాలనీలలో డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ ల ఏర్పాటు పనులు, రోడ్ల నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ నాలాకు ఎగువ నుండి వచ్చే వరద నీటితో పరిసర కాలనీలు ముంపుకు గురయ్యేవని తెలిపారు. కానీ ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులతో ఈ సంవత్సరం వరదనీటి ముంపు సమస్య ప్రభావం అంతగా లేదనే చెప్పొచ్చని మంత్రి అన్నారు.
గాయత్రీ నగర్ నాలా పరిశీలన:
అమీర్ పేట డివిజన్ లోని గాయత్రీ నగర్ లో గల నాలాను కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నాలా వెంట ఆక్రమణలు, ఆక్రమ నిర్మాణాలకు గురవుతుందని స్థానిక ప్రజలు చేసిన పిర్యాదు మేరకు మంత్రి ఈ నాలాను పరిశీలించారు. నాలా అభివృద్ధికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా నాలాను పరిశీలించిన అనంతరం వెంటనే ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. నాలా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE