టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారు జామున ఫిలింనగర్లోని తన నివాసంలో 87 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యనారాయణ చివరిసారిగా 2019లో మహేష్ బాబు యొక్క ‘మహర్షి చిత్రం’లో పూజా హెగ్డే తాత పాత్రలో కనిపించారు. అలాగే గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కాగా కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో జరుపనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానం..
ఇక కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసం విజయవాడలో, అనంతరం గ్రాడ్యుయేషన్ గుడివాడల్లో పూర్తి చేశారు. నటనపై మక్కువతో విద్యాభ్యాసం అనంతరం చెన్నపట్నం చేరిన ఆయన.. 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన, తన 60 ఏళ్ళ నటప్రస్థానంలో 777 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. కైకాల, అలనాటి ప్రముఖ సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ఆ తర్వాత కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు వంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి తన తదుపరి తరం నటులతో కూడా ఆయన నటించారు. తెలుగు ప్రేక్షకులకు ‘యుముడు’ పాత్ర అంటే మొదట గుర్తొచ్చేది ఆయనే. అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించగల కైకాల ‘నవరస నటనా సార్వభౌముడు’గా బిరుదు అందుకున్నారు. అలాగే ‘సత్యనారాయణ రామ ఫిలిమ్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘కొదమ సింహం’ (1990), ‘బంగారు కుటుంబం’ (1994) మరియు ‘ముద్దుల మొగుడు’ (1997) వంటి హిట్ చిత్రాలను నిర్మించారు.
కైకాల సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం..
తన సహచర దిగ్గజ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహిత అనుచరుడుగా ఉన్న కైకాల సత్యనారాయణ కొంతకాలం రాజకీయాల్లో కూడా కొనసాగారు. మచిలీపట్నం నుండి తెలుగుదేశం పార్టీ (టిడిపి) అభ్యర్థిగా 11వ లోక్సభకు ఎన్నికయ్యారు. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ మరణం తదనంతర పరిణామాలలో ఆయన 1998 తర్వాత రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక ఆయన తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 2011లో ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు, 2017లో ‘ఫిల్మ్ఫేర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డ్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుంచి ‘నం’ది ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. ఇక ఈ విషాద వార్త తెలిసిన పలువురు టాలీవుడ్ నటీనటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కైకాల సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ