మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎక్సైజ్, టూరిజం, క్రీడలు యువజన సర్వీసులశాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ లు జనవరి 24, శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా సత్వర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మేడారంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై, పరిశుభ్రత మరుగుదొడ్ల నిర్మాణంపై పలుచోట్ల తిరిగి పరిశీలించారు. జాతర పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పనుల పర్యవేక్షణ చేయాలని, క్షేత్ర స్థాయిలో పనులు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
స్థానికంగా పనిచేస్తున్న అధికారులకు తోడుగా జీహెచ్ఎంసీ, జిడబ్ల్యుఎంసీ, ఇతర మునిసిపల్ కార్పొరేషన్ ల నుండి అనుభవజ్ఞులైన అధికారులను, నైపుణ్యం కలిగిన సిబ్బంది సేవలను జాతరకు కోసం ఉపయోగించుకోవాలని మంత్రులు సూచించారు. జాతర ప్రాంతాన్ని సెక్టార్ లుగా చేసుకొని విధులకు అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా నియమించాలన్నారు. ముఖ్యంగా శానిటేషన్, మరుగుదొడ్లు, మంచినీటి ఏర్పాట్లపై దృష్టి సారించాలని అన్నారు. షాపులకు డస్ట్ బిన్ లు వాడేలా ఆదేశాలు ఇచ్చి, పరిశుభ్రత పాటించేలా హెచ్చరికలు జారీ చేయాలని, పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతరను విజయవంతం చేయడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ 75 కోట్ల రూపాయలను కేటాయించడమే కాకుండా, నిత్యం అధికారులతో సమీక్ష సమావేశం జరుపుతున్నారని, జాతర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలను నినాదాలతో కూడిన బొమ్మలను ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.
వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులను మేడారం వచ్చే విధంగా ఆహ్వాన పత్రాలను అందజేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి సైతం జాతరకు వచ్చే విధంగా చూస్తామని మంత్రులు పేర్కొన్నారు. సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమైతే, కఠిన చర్యలు తప్పవని చెప్పారు. జాతర పరిసర ప్రాంతాల్లో చుట్టూ ఫోకస్ లైట్లను ఏర్పాటు చేయాలని, మిగిలిన పనులను మరో మూడు రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారంలో 14 కోట్ల రూపాయలతో హరిత హోటల్ నిర్మించడం జరిగిందని, హోటల్ లో భక్తులకు సరిపడా సౌకర్యాలను కల్పించడం జరిగిందని అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం జాతర దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అని, జాతర విజయవంతానికి భక్తులు కూడా సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతర గా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, భక్తులు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా క్లాత్, జూట్, పేపర్ సంచులను తీసుకురావాలని కోరారు. ములుగు జిల్లాలో రామప్ప లక్నవరం, బోగత జలపాతం, సమ్మక్క సారలమ్మ జాతర దట్టమైన అటవీ ప్రాంతాలు కలిగి ఉండడంతో ఈ జిల్లాను పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని అన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చర్యలు తీసుకుంటున్నట్లు, త్వరలోనే కేంద్ర మంత్రులను కలిసి విన్నవించడం జరుగుతుందని మంత్రులు పేర్కొన్నారు.
[subscribe]