ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ భేటీలో శాసన మండలిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాసన మండలిని రద్దు చేసే దిశగా ప్రతిపాదనలను సిద్ధం చేసి, మండలి రద్దుపై తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసన మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దానిపై చర్చించిన అనంతరం ఆమోదం తెలిపే దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటుగా తెలుస్తుంది. రద్దు తీర్మానం సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లును పార్లమెంట్ ఆమోదం కోసం పంపే విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతుంది.
[subscribe]