తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. ముందుగా ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పోరేషన్ల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతుంది. ఫలితాల సరళి పూర్తీ అనుకూలంగా ఉండడం, పలు చోట్ల ఇప్పటీకే పార్టీ జయకేతనం ఎగురవేయడంతో టిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్దకు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయంతో స్వీట్స్ పంచుకుంటూ, ఆనందంతో నృత్యం చేశారు. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ఫలితాల సరళిని పర్యవేక్షిస్తూ, నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
మధ్యాహ్నం 1 గంట వరకు వెలువడిన ఫలితాల్లో 120 మున్సిపాలిటీలకు చెందిన 2727 వార్డుల్లో టిఆర్ఎస్ 1228 వార్డులు గెలుచుకుంది. అలాగే 9 కార్పోరేషన్లలోనూ టిఆర్ఎస్ పూర్తిస్థాయి ఆధిపత్యం కొనసాగిస్తుంది. మరోవైపు జనవరి 27న మేయర్లు, ఛైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ఛైర్పర్సన్ల ఎన్నిక పక్రియ చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగగా, అక్కడ ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 27న చేపడతారు.
[subscribe]