ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కెటి రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తదితరులు వరంగల్ నగరంలో భారీ వర్షాలు, వరదలతో ప్రభావిత ప్రాంతాలను మంగళవారం నాడు పరిశీలించారు. అనంతరం మంత్రుల బృందం వరంగల్ లోని ఎంజీఎంలో కోవిడ్ వార్డును సందర్శించింది. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పిపిఈ కిట్లు ధరించి కోవిడ్ వార్డులోకి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
కావాల్సిన మందులు, పరికరాలు, ఇంజక్షన్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నాయని, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. కరోనా సోకిన వారి దగ్గరికి రావడానికి సమీప బంధువులే జంకుతున్న సమయంలో కేటీఆర్ సహా మంత్రులంతా ఎంతో తెగువతో కోవిడ్ వార్డులోకి వెళ్లి, చికిత్స పొందుతున్న వారితో నేరుగా మాట్లాడడంతో వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu