నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు పునః నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నూతన ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలు జాన్ 4న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ “మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మా వంశ పారంపర్య ఇలవేల్పు అయిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి ఆలయ నూతన నిర్మాణం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా సిహెచ్ కొండూరు, నందిపేట్ (మం) నిజామాబాద్ జిల్లాలో జూన్ 4 నుండి 9 వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగనున్నాయి. లోక కళ్యాణార్థమై, విశ్వ శాంతికై, అందరి ఆయురారోగ్య ఐశ్వర్యసిద్దికై జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని మీకిదే మా సాదర ఆహ్వానం” అని పేర్కొన్నారు.
మొదటి రోజైన జూన్ 4, శనివారం ఉదయం రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన, శిలామయ, లోహమయమూర్తి, యంత్ర ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత, కుటుంబ సభ్యులు “మహాయజ్ఞం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యకమాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఇక రెండవరోజైన జూన్ 5, ఆదివారం నాడు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి తదితరులు ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఆదివారం ఉదయం ప్రాతఃకాల ఆరాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. సేవాకాలం, ద్వారా తోరణ ధ్వజ కుంభ ఆరాధన, చతుఃస్థానార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే నిర్వహించబోయే కార్యక్రమాలలో తెలిసో తెలియకో జరిగే అపరాధాలనుంచి విముక్తి కల్పించాలని కోరుతూ నిష్టతో భూదేవతకు వాస్తు పూజ, క్షమారాధన నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత, భర్త అనిల్, కుటుంబ సభ్యులు మరియు భక్తులతో కలిసి యాగశాల ప్రవేశ పూజ నిర్వహించారు. అగ్ని ప్రతిష్ట చేసి కల్వకుంట్ల కవిత దంపతులు, కుటుంబ సభ్యులు యాగం నిర్వహించారు. ఇక సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో కార్యక్రమాలు జరిగాయి. నరసింహ స్వామి ప్రీతియజ్ఞంతో పాటు, మూల మంత్ర మూర్తి మంత్ర హవనాలు నిర్వహించారు. ప్రతిష్టించనున్న విగ్రహాలకు పవిత్ర జలాధివాసం వేడుకగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగిన ధార్మిక క్రతువులకు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇక మూడోరోజైన జూన్ 6, సోమవారం ఉదయం ప్రారంభమైన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత దంపతులు పాల్గొన్నారు. ఉదయం సేవాకాలం, నివేదన, మంగళాశాసనము, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, నిత్య పూర్ణాహుతి సహా పలు కార్యక్రమాలు జరుగనుండగా, సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ప్రతిష్ఠా విగ్రహాలకు క్షీరాధివాసము కార్యక్రమాలు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF