తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం కోర్టు కొలీజియం సిపారసు చేసిన హైకోర్టు న్యాయవాదులు తడకమళ్ల వినోద్ కుమార్, అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి, కూనూరు లక్ష్మణ్ ను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి పేర్లను ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. కొత్తగా నియామక ఆదేశాలు పొందిన ముగ్గురు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ ను మర్యాదపూర్వకముగా కలిశారు. వీరు ఈ నెల 26వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్తగా ముగ్గురు న్యాయమూర్తుల చేరికతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14 కు చేరుకుంది. మొత్తం 24 పోస్టులు మంజూరుకాగా ఇంకా మరో 10 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
కూనూరు లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందినవారు. 1993లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకుని, 1999లో స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 2017 నుంచి కేంద్రం తరఫున తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గా పనిచేస్తున్నారు. అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా, అమెరికాలోని వాషింగ్టన్ లా కాలేజీలో ఎల్ఎల్ఎం పూర్తి చేసారు. 1990 లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకుని హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2004 నుంచి 2009 వరకు పలు ప్రభుత్వరంగ సంస్థలకు న్యాయవాదిగా సేవలందించారు. తడకమళ్ల వినోద్ కుమార్ నల్లగొండ జిల్లా దాచారం గ్రామంలో జన్మించారు. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు, 1993 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి హైకోర్టులో ఆదాయపు పన్ను శాఖకు స్టాండింగ్ కౌన్సిల్ గా, 2016 నుంచి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు స్టాండింగ్ కౌన్సిల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=wmiU3nfKmlo]