బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఈ నెల 9వ తేదీన ఎయిమ్స్ లో చేరినప్పటినుండి వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.09 గంటలకు అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశాయి. అరుణ్ జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సోనాలి, కుమారుడు రోహన్ ఉన్నారు. జైట్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే బీజేపీ అగ్రనేతలతో పాటు, పలువురు ఇతర రాజకీయ పార్టీల నేతలు వెళ్లి పరామర్శించారు.
విద్యార్థి దశలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేసారు. న్యాయవాదిగా సుప్రీం కోర్టు, కొన్ని హైకోర్టులలో ప్రాక్టీస్ చేసారు. 1990 లో ఢిల్లీ హైకోర్టులో అరుణ్ జైట్లీ సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు. 1991 నుంచి బీజేపీ పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా పనిచేసారు. 2009లో రాజ్యసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు. 2014 జనరల్ ఎన్నికల్లో తొలిసారి అమృత్ సర్ నుంచి పోటీచేసి కెప్టెన్ అమరిందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 2014 లో బీజేపీ అధికారంలోకి రావడంతో రాజ్యసభకు ఎన్నికయ్యి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, కార్పోరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేసారు.
2017 లో రక్షణ శాఖ మంత్రిగా కూడ బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన కూడ అనారోగ్య కారణాలదృష్ట్యా అమెరికాలో చికిత్స తీసుకుంటుండడం వలన మంత్రి వర్గంలోకి చేరలేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగుతూ ఇంటికే పరిమితం అయ్యారు. అరుణ్ జైట్లీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ప్రముఖ నాయకులు, సెలెబ్రిటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.