భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ, భారత రాష్ట్రపతి హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సాధారణ ప్రజలు సందర్శించేలా వీలు కల్పించే ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఉగాది శుభదినమని, తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభం రోజున భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో భారత రాష్ట్రపతి హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారనే విషయం విదితమేనన్నారు. రాష్ట్రపతి నిలయం సందర్శకుల కోసం పునరుద్ధరించబడిందనీ, 162 సంవత్సరాల పురాతన ఐకానిక్ హెరిటేజ్ బిల్డింగ్ సందర్శకులకు మొదటిసారిగా తెరవబడిందనీ, 97 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఉద్యానవనాలు, ఆర్ట్ గ్యాలరీ మరియు భూగర్భ సొరంగం వంటివి ప్రధాన ఆకర్షణలు అన్నారు. జై హింద్ ర్యాంప్ పునరుద్ధరణ మరియు చారిత్రాత్మక ఫ్లాగ్ పోస్ట్ నమూనా నిర్మాణానికి భారత రాష్ట్రపతి శంకుస్థాపన చేయడం పట్ల ఆనందం వెలిబుచ్చారు. పర్యాటకుల కోసం గోల్ఫ్ కార్ట్లు, క్యాంటీన్లు మొదలైన అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల హైదరాబాద్ లో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నా, రాష్ట్రపతి నిలయం ఖచ్చితంగా మరొక పర్యాటక ఆకర్షణగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సందర్శకులకు రవాణా మరియు ఇతర సౌకర్యాలు కల్పించేలా చూస్తామని హోమ్ మంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE