గుజరాత్లోని సూరత్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీపై పరువునష్టం కేసులో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు గురువారం 2019లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్లో జరిగిన లోక్సభ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అని ఉంది అంటూ రాహుల్ గాంధీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీ చేసిన ఫిర్యాదుపై రాహుల్ గాంధీపై కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో దీనిపై విచారణ సందర్భంగా సూరత్ కోర్టు స్పందిస్తూ.. రాహుల్ వ్యాఖ్యలు తప్పేనని తేల్చి చెప్పింది. గత శుక్రవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్హెచ్ వర్మ ముందు పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కిరీత్ పన్వాలా తుది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తీర్పును రిజర్వు చేసిన సూరత్ న్యాయస్థానం నేడు శిక్షను ప్రకటించింది. అయితే ఈ తీర్పును రాహుల్ గాంధీ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని కిరీత్ పన్వాలా మీడియాకు తెలిపారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 499 మరియు 500 (పరువు నష్టంతో వ్యవహరించడం) కింద దాఖలు చేసిన కేసులో రాహుల్ గాంధీ చివరిసారిగా 2021 అక్టోబర్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి సూరత్ కోర్టుకు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE