భారతదేశ బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 24, మంగళవారం నాడు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) కూడ మద్ధతు పలికింది. ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూలు సైతం సమ్మెను బలపరుస్తూ సింగరేణిలో ప్రచారం కూడా జరిపాయి. దీనితో మంగళవారం నాడు బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోనుంది. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ కూడ మద్ధతు తెలపడంతో సింగరేణి సమ్మె విజయవంతమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత తొలిసారిగా జాతీయ కార్మిక సంఘాల పిలుపుకు మద్దతిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ సమ్మెలో పాల్గొంటుంది. ఈ నిర్ణయం వలన సింగరేణి యాజమాన్యానికి రూ.50 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. కొత్తగూడెం భూగర్భ గనులలో బంద్ ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది. ఇక రామగుండము, మందమర్రి, బెల్లంపల్లి రీజియన్లలో సమ్మె ప్రభావం పూర్తిగా పడి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఉపరితల గనుల్లో మాత్రం పాక్షికంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు గట్టి ప్రయత్నం చేసాయి.
[subscribe]