జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ స్టేషన్లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఎంజీబీఎస్ స్టేషన్ వరకు ఆయన ప్రయాణించారు. ఈ మెట్రో మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 1లో చివరిదైన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. 11 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్లో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ వంటి 9 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా అత్యంత ఎత్తులో నిర్మించిన మెట్రో స్టేషన్ గా జేబీఎస్ నిలవనుంది. ఈ స్టేషన్ ను ఐదంతస్తుల ఎత్తులో నిర్మించారు. అలాగే ఈ కారిడార్ ప్రారంభోత్సవంతో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా హైదరాబాద్ మెట్రోరైల్ నిలిచింది.
[subscribe]