తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. 4 బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ఆయన మంచిర్యాల, గోదావరిఖనిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్సీ విఠల్, జెడ్పీచైర్మన్లు జనార్దన్ రాథోడ్, కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, రాథోడ్ బాపు రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బెల్లంపల్లిలో రూ.30 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి, రూ.44 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాన్ని కూడా ప్రారంభించారు. ఇంకా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర పోలీసు హౌసింగ్బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన మాడ్రన్ పోలీసు కమిషనరేట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గోదావరిఖని-రామగుండం మధ్య పోలీసు హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో 29 ఎకరాల స్థలంలో 59 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కమిషనరేట్ను సువిశాలంగా నిర్మించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా నిర్మించిన పైలాన్ను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం సోమవారం బెల్లంపల్లిలోని గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే గంగి రెద్దుల వారిలా కొన్ని పార్టీలు వస్తున్నాయని, వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరు అర్థం కావడం లేదని, తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దేవుడు అంటున్నారని మండిపడ్డారు. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలను ఇక్కడి నుంచి గెలిపిస్తే.. సాయం చేయకపోగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయోజనం కలిగించినందుకు వ్యాపారవేత్త అదానీకి, పదవి ఇచ్చినందుకు సంజయ్కు మాత్రమే ప్రధాని మోదీ దేవుడని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఒక్క ఛాన్స్ ఇవ్వమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నారని.. ఒకసారి కాదు 50 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త అని, అయితే ప్రస్తుతం కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అని అన్నారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుతం కొన ఊపిరిలో ఉందని, దాని పతనానికి స్వయంకృతాపరాధమేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని, కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE