తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 4 శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానిగా నరేంద్రమోదీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా ఆయనతో సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు నరేంద్ర మోదీతో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టు గురించి మోదీతో చర్చించినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులలో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు కేటాయించాలని కోరినట్టు తెలుస్తుంది.
వీటితో పాటు పెండింగ్ లో ఉన్న విభజన హామీల పరిష్కరానికి కూడ చొరవ చూపాలని ప్రధానమంత్రి మోదీని, కేసీఆర్ కోరినట్లు సమాచారం. మోదీతో భేటీ కాకముందు, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, సంతోష్ కుమార్, పలువురు టిఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు.
[subscribe]