ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా విశాఖపట్నంలో భారత జట్టుతో జరుగుతున్న తోలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు మంచి పోరాట పటిమ చూపించింది. భారత జట్టు తోలి ఇన్నింగ్స్ ను 502/7 వద్ద డిక్లేర్డ్ చేయగా, ఓవర్ నైట్ స్కోర్ 39/3 తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు మంచి ప్రదర్శన కనబరిచి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ 160 పరుగులు, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 113 పరుగులతో సెంచరీలు సాధించారు. మరోవైపు కెప్టెన్ డుప్లెసిస్ కూడ 55 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఒక్క రోజులోనే 346 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజాకు 2 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 117 పరుగులు ఆధిక్యంలో ఉంది.
మూడోరోజు ఆట ఆరంభంలోనే ఇషాంత్ శర్మ బౌలింగ్ లో బవుమా 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్, ఓపెనర్ ఎల్గర్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. డుప్లెసిస్ అశ్విన్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన డికాక్, ఎల్గర్ తో కలిసి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. రెండవ, మూడవ సెషన్స్ లో కూడ బౌలర్లపై ఒత్తిడి పెంచి పరుగులు సాధించారు. ఎల్గర్ జడేజా బౌలింగ్ లో అవుట్ అవ్వగా, డికాక్ అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఎల్గర్, డికాక్ ఇన్నింగ్స్ ప్రారంభదశలోనే ఇచ్చిన క్యాచ్ లను సాహా, రోహిత్ శర్మ వదిలేయడంతో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఎల్గర్ ను అవుట్ చేసిన రవీంద్ర జడేజా టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 44 మ్యాచుల్లో అతను ఈ ఘనత సాధించడం విశేషం. అత్యంత వేగంగా టెస్టుల్లో 200 వికెట్లు సాధించిన బౌలర్ గా అశ్విన్ తరువాత రెండో స్థానంలో నిలిచాడు.