తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నవంబర్ 8, శుక్రవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ ను కలిసిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, జానారెడ్డి, అంజన్కుమార్ యాదవ్ లతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ విభాగం చలో రాజ్ భవన్ కు పిలుపు నిచ్చింది.
ఈ క్రమంలో ముందుగా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులకి, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో గాంధీ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకుంది. చివరకు కొద్దిమంది కాంగ్రెస్ నాయకులకు మాత్రమే గవర్నర్ తమిళిసై ను కలిసేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. మరోవైపు నిరసనలో భాగంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా, ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు వారిని ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు.
[subscribe]