తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 35 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను మరింతగా ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నవంబర్ 9, శనివారం నాడు చలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని తలపెట్టింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జేఏసీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో అన్ని విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు చలో ట్యాంక్బండ్ కార్యక్రమానికి మద్ధతు తెలిపిన నేపథ్యంలో భారీ సంఖ్యలో జనం హాజరవుతారని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల కుటుంబ సభ్యులతోపాటు, విపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద స్థాయిలో తరలివచ్చేలా జేఏసీ నాయకులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ రేపు తలపెట్టిన చలో ట్యాంక్బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ రోజు అఖిలపక్ష నేతలు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ను కలిసి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇటువంటి ఆందోళన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు, ముఖ్యమైన కార్మికులను భద్రతా కారణాలు, ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. దీనిపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ, కార్మికుల ఇళ్లల్లో దాడులు చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా సరే చలో ట్యాంక్బండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. అలాగే ఈ రాత్రి సమయానికే కార్మికులంతా హైదరాబాద్కు చేరుకోవాలని పిలుపునిచ్చారు.
[subscribe]