హైదరాబాద్ నగరంలోని చంద్రాయణ గుట్టలోని ఉప్పుగూడ, పరివార్ టౌన్ షిప్ లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, ప్రజలు తమంత తాముగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలను వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించి హైదరాబాద్ నగరాన్ని 100 శాతం వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలన్నారు. ఈ ప్రాంతంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు, వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డోర్ టూ డోర్ సర్వేను పూర్తిచేశామని, వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించామని అధికారులు సీఎస్ కు వివరించారు. ఈ ప్రాంతంలో నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని స్ధానిక ప్రతినిధులు సీఎస్ కు హామీ ఇచ్చారు.
ముందుగా అర్హులైన ప్రజలందరికి మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగేలా జీహెచ్ఎంసీ ఏరియా వైద్యఆరోగ్య శాఖ 100 శాతం వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ మాప్ అప్ డ్రైవ్ ను చేపట్టింది. కాలనీల వారిగా విధానాన్ని రూపొందించి డోర్ టు డోర్ సర్వేతో పాటు వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 585 కాలనీలల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది. 47,104 మందికి మొదటి విడత, 7304 మందికి రెండవ విడత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ నుండి 4182 మంది సిబ్బందిని, వైద్యశాఖ 1639 మంది సిబ్బందిని రంగంలోని దించడం జరిగింది. కాలనీల స్ధాయిలో మొబైల్ వ్యాక్సినేషన్ కోసం 594 వాహనాలను వినియోగిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎస్ తో పాటుగా ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎమ్ రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ