ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలో వరద ప్రభావిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్ధిక సహాయం అందేలా ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు బిఆర్ కెఆర్ భవన్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో ఆర్ధిక సహాయం పంపిణీపై సీఎస్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో 300 బృందాలను, పరిసర మున్సిపాలిటీల పరిధిలో మరో 50 బృందాలను ఏర్పాటు చేసి బాధితులకు ఎటువంటి జాప్యం లేకుండా ఇంటివద్దే ఆర్ధిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక కంట్రోల్ రూం, అదేవిధంగా సిడిఎంఎ కార్యాలయంలో మరో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసి వరద సహాయ పంపిణీని పర్యవేక్షించాలని అన్నారు.
అధికారులు రూట్ ప్లాన్ ను సిద్ధం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలని, జిల్లాల నుండి అవసరమైన మేరకు సిబ్భందిని సమకూర్చుకోవాలని అన్నారు. నగరంలోని ప్రతి సర్కిల్ కు పది బృందాలు చొప్పున, ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులు ఉండేవిధంగా చూసుకొని ఆర్ధిక సహాయాన్ని పంపిణీ చేయాలని అన్నారు. ప్రతి సర్కిల్ లో రూట్ ఆఫీసర్ ను నియమించి బృందాలకి అవసరమైన నిధులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెలవులలో కూడా నిధుల పంపిణీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కువ విలువ గల కరెన్సీ నోట్లను తగు మొత్తంలో అందుబాటులో ఉంచాలని ఎస్ఎల్బిసి కన్వీనర్ ను కోరినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu