తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. రబీ సీజన్ రైతు బంధు కోసం రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ జనవరి 20, సోమవారం నాడు ప్రభుత్వం జీఓ నం.37 విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా, నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. 2019-20 వార్షిక బడ్జెట్లో రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం 12,862 కోట్లు కేటాయించింది. ముందుగా ఖరీఫ్ సీజన్లో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. తాజాగా రబీసీజన్ కోసం రైతులకు అందించేందుకు రూ.5,100 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధుల మంజూరుకు పరిపాలనాపరమైన అనుమతులు రావడంతో రైతుల వివరాలను వ్యవసాయ శాఖ వెంటనే ఆర్థికశాఖకు అందించనుంది. రబీ సీజన్ రైతుబంధుకు నిధులు విడుదల చేయడం పట్ల మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు.
[subscribe]