దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు, హైకోర్టులలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారి మృతదేహాలను గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన సంగతి తెలిసిందే. అయితే నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించే విషయంపై ఈ రోజు ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం, దిశ హత్యాచారం కేసు నిందితులకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. డిసెంబర్ 23, సోమవారం నాడు సాయంత్రం 5 గంటలలోపు రీ పోస్టుమార్టం నిర్వహించాలని చెప్పింది. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణలతో ఈ ప్రక్రియ నిర్వహించాలని కోర్టు కోరింది. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశించింది.
అనంతరం పోలీసుల సమక్షంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ను కోర్టు ఆదేశించింది. ఈ రోజు జరిగిన విచారణకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. నలుగురు నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం డీ కంపోజ్ అయ్యాయని, ఐదారురోజుల్లో పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని శ్రవణ్ కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో ఇతర అంశాలన్నీ పరిశీలించి నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
[subscribe]