తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. తొలిరోజు సభను వాయిదా వేశాక అసెంబ్లీలో బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 28 వరకు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొత్తం 17 రోజుల పాటుగా కొనసాగనున్నాయి. సెప్టెంబర్ 12, 13, 20, 27వ తేదీల్లో రెండవ శనివారం, ఆదివారాలు సందర్భంగా సెలవులు ప్రకటించారు. మరోవైపు శాసనసభలో అర గంట పాటు జీరో అవర్, గంట పాటు ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని నిర్ణయించారు.
కొత్త రెవెన్యూ చట్టం, కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, ఆంధ్రప్రదేశ్ తో నీటి వివాదాల అంశం, జిఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, నియంత్రిత పద్ధతిలో పంట సాగుతో పాటు వ్యవసాయ రంగం, పీవీ శతజయంతి ఉత్సవాలు వంటి అంశాలతో పాటుగా పలు ఇతర అంశాలు, బిల్లులపై కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో కీలకంగా చర్చించబోతున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu