తెలంగాణాలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ ఆవరణలోని కమిటీ హాల్ లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, శాసనసభ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు సమావేశమయ్యారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, “ఈనెల 7వ తారీఖు నుండి ప్రారంభం అయ్యే ఈ దఫా సమావేశాలు ప్రత్యేకమైనవి. 20 రోజులు వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఈసారి సమావేశాలలో కొన్ని నిబంధనలను విధించడం జరుగుతుంది. శాసనసభ్యుల, మరియు సిబ్బంది క్షేమం కోసమే ఈ నిబంధనలు. పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ, జీహెఛ్ఎంసీల ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరంలో మరియు పరిసరాలలో శానిటైజేషన్ కార్యక్రమాలు రోజుకు రెండు సార్లు చేపడతాం. ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ధర్మల్ స్క్రీనింగ్, ర్యాపిడ్ టెస్ట్ లు చేస్తాం. సభ్యుల కోసం అసెంబ్లీ, మండలి ఆవరణలో రెండు ప్రత్యేక డయాగ్నోసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రెండు అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి. అనుభవజ్ఞులైన డాక్టర్లు డ్యూటీలో ఉంటారు. ప్రతి సభ్యుడికి ఆక్సీమీటర్, మాస్క్, శానిటైజర్, ఇతర అత్యవసరమైన మెడికల్స్ తో కూడిన కిట్ ను అందజేస్తాం. మంత్రులతో పాటు ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే అనుమతి ఇస్తాం. శాసనసభ్యుల వ్యక్తిగత సిబ్బందికి అనుమతి లేదు. సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఈరోజు సాయంత్రం నుండే పరీక్షలు చేయడం ప్రారంభిస్తున్నాం” అని చెప్పారు.
“శాసనసభ్యులు, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మంత్రుల సిబ్బంది, అసెంబ్లీ మార్షల్స్ 6వ తేది నాటికి కరోనా పరీక్షలు చేయించుకోవాలి. హైదరాబాద్ లో ఉండే సభ్యులు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రంలో టెస్ట్ చేయించుకోవాలి. జిల్లాలో ఉన్న సభ్యులు సమాచారం అందిస్తే అక్కడే టెస్ట్ లు నిర్వహిస్తాం. పాజిటివ్ రిపోర్టు వస్తే సభ్యులు, సిబ్బంది ఎవ్వరు కూడా అసెంబ్లీ ఆవరణలోకి, సభకు రావద్దు. మాస్క్ లు ఉంటేనే సభలోకి అనుమతిస్తాం. నెగెటివ్ రిపోర్ట్ ఉన్న సిబ్బందిని మాత్రమే అసెంబ్లీ ఆవరణలోకి అనుమతిస్తాం. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసిన పరిస్థితులు తలెత్తాయి. వివిధ రాష్ట్రాలలో, పార్లమెంటు లో అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే వచ్చే శాసనసభ సమావేశాల సందర్భంగా మీడియాకు కొన్ని నిబంధనలను విధిస్తున్నాం. అందరి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ లాబీల్లో ఈసారి మీడియా ప్రతినిధులను అనుమతించకూడదని నిర్ణయించాం. అదేవిధంగా నిరంతరం రద్దీగా ఉండే మీడియా పాయంట్ కూడా కరోనా పరిస్థితుల దృష్ట్యా తొలగించడమైనది. మీడియా ప్రతినిధులు, యాజమాన్యాలు సహకరించాలని మనవి. ఈసారి విజిటర్స్ కు కూడా అనుమతి లేదు. నో లాభి పాసెస్, విజిటర్స్ గ్యాలరీలో కూడా మీడియా ప్రతినిధులకు సీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. చర్చల సమయంలో సభ్యులు పూర్తి సహాయ, సహకారాలను అందించాలని విజ్ఞప్తి. సభ్యులు తమకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, “కరోనా వైరస్ ప్రభాలుతున్న పరిపాలన సౌలభ్యం కోసం ఈ నెల 7 తేదీ నుండి అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమావేశాలు ఏ విధంగా నడపాలి అనే విషయంలో ఇప్పటికే మూడు పర్యాయాలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. కరోనా లక్షణాలు ఉన్న శాసన మండలి,అసెంబ్లీ సభ్యులు సమావేశాలకు రాకూడదు అని కోరుతున్నాము. కరోనా కట్టడికి స్వీయ నియంత్రనే ముఖ్యం. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే శాసన మండలి, శాసన సభ సభ్యులకు, వారి పియస్, పిఏ,సెక్యురిటి, అధికారులకు,మీడియా ప్రతినిధులు అందరికి కరోనా టెస్టులు చేస్తాం, నెగిటివ్ వచ్చిన వ్యక్తులను మాత్రమే సభలోకి అనుమతి చేస్తాం.ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ప్రజలకు జవాబుదారులం. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారులు తప్పకుండా సమాధానం ఇవ్వాలి. గతంలో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు కూడా త్వరగా సమాధానాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాం. రానున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కరోనా నియంత్రణ కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులకు,వైద్య,పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాలని అనే దురుద్దేశ్యం తో కొందరు నేతలు ధర్నాలు,నిరసనలు, చలో అసెంబ్లీ లాంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీస్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని విధంగా ప్రశాంతంగా, ప్రజలకు జవాబు దారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహిస్తుంది” అని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu