నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఒకవైపు నామినేషన్లు దాఖలు, మరోవైపు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఈ పరిణామాల మధ్య మంగళవారం నియోజకవర్గ పరిధిలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రచారానికి సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు, జెండాలు కాలిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు ఈ అగ్నిప్రమాదం జరగడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగానే జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఇక ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక ఆడబిడ్డపై పోటీకి భయపడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే భయంతోనే ప్రత్యర్దులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు తాను స్వయంగా ధర్నా చేస్తానని ప్రకటించారు. పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను పోలీసులు కఠినంగా శిక్షించాలని రేవంత్ కోరారు. ఇక మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేకనే పార్టీ ఆఫీసులపై దాడులకు తెగబడతున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా దీనిపై స్పందించారు. ఇది చేసింది ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలని.. ఎన్నికలలో ప్రజాబలంతో గెలవడానికి ప్రయత్నించాలే కానీ, ఇలాంటి పిరికిపంద చర్యలతో కాదని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY