తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా శుక్రవారం నాడు అనుచరులు, పార్టీ కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమై పార్టీని వీడడంపై చర్చించారు. పార్టీ కోసం ఎంతో శ్రమించినా అవమానిస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొందరు కుట్రలు చేశారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసి, చోటుచేసుకున్న పరిణామాలపై సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి లేఖ రాయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కాగా ఈ పరిణామాల నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడకుండా బుజ్జగింపు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
శనివారం నాడు జగ్గారెడ్డిని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను వీడొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ సూచించగా, మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పార్టీ వీడొద్దని బొల్లి కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై జగ్గారెడ్డి స్పష్టత ఇచ్చారు. రాజీనామాపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని, రెండ్రోజుల తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఎదో ఒక నిర్ణయమైతే ఉంటుందన్నారు. పార్టీలో తనపై దుష్ప్రచారం జరుగుతుందని, అన్ని అంశాలపై బహిరంగ లేఖతో పాటుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధకి లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ